శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో క్షేత్రస్ధాయిలో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్రానికి నివేదిక సమర్పించారు. కేంద్రం నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారని, క్షేత్రస్ధాయిలో పరిస్థితి సంతృప్తికరంగా ఉందని హోంమంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో ఆయన పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో అధికారాలు, బాధ్యతల బదలాయింపు సజావుగా సాగేలా కశ్మీర్లో అజిత్ దోవల్ తనవైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు పట్ల కశ్మీరీలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఎలాంటి ఆందోళనలూ లేవని.. ప్రజలు తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారని అజిత్ దోవల్ కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు.
మరోవైపు సాధారణ పరిస్థితులు నెలకొన్న క్రమంలో జమ్మూ కశ్మీర్ మరలా రాష్ట్ర హోదా పొందుతుందని, ఎప్పటికీ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్నది తమ అభిమతం కాదని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను స్థానిక ప్రజలు స్వాగతిస్తున్నారని దోవల్ తన నివేదికలో పొందుపరిచారు.