-

‘మన్‌కీ బాత్’‌ కార్యక్రమంలో కర్ణాటక వృద్ధుడిపై ప్రశంసలు

29 Jun, 2020 08:32 IST|Sakshi
16 చెరువులు తవ్వించి ప్రధాని చేత ప్రశంసలు పొందిన గొర్రెల కాపరి కామె గౌడ

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో అభినందించారు. ఆ వివరాలు.. మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి ఇది చాలా పెద్ద విషయమే. దాంతో ఇది కాస్తా ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు. దీనిపై సదరు వృద్ధుడు స్పందిస్తూ.. ‘నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్‌ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారు. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి)

నిన్నటి ‘మన్‌కీ బాత్’‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్‌ తగిన సమాధానం చెప్పిందని తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు