కరోనాపై పోరు: ఒడిశా కీలక నిర్ణయం

3 Apr, 2020 16:38 IST|Sakshi
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌(ఫైల్‌ ఫొటో)

భువనేశ్వర్‌: మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం ఉధృతం చేసే క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ అమలు అవుతున్న తరుణంలో... రాజధాని భువనేశ్శర్‌ సహా భద్రక్‌ పట్టణంలో 48 గంటల పాటు షట్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఏకే త్రిపాఠి  మీడియాకు వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిత్యావసరాల అమ్మకాలు జరిపే షాపుల కార్యాకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగబోదని తెలిపారు. అయితే రాజధానిలో వీటిని కూడా మూసివేస్తామని.. కేవలం ఎంపిక చేసిన మెడికల్‌ స్టోర్ల సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.(కరోనా: రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు

ఈ మేరకు స్థానిక పాలనా యంత్రాంగం ఆదేశాల ప్రకారం షాపు నిర్వాహకులు నడుచుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలో ఇప్పటివరకు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. అందులో నలుగురు బాధితులు భువనేశ్వర్‌, భద్రక్‌ పట్టణానికి చెందినవారే గమనార్హం. ఈ నేపథ్యంలో ఏకే త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ భువనేశ్వర్‌, భద్రక్‌ జిల్లా కేంద్రంలో 48 గంటల పాటు అనగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల దాకా షట్‌డౌన్ విధించనున్నాం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సైతం యథావిధిగా కొనసాగుతుంది’’అని పేర్కొన్నారు. ఇక షట్‌డౌన్‌ కారణంగా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని డీజీపీ అభయ్‌ భరోసా ఇచ్చారు. అయితే ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(క‌రోనా నుంచి బయ‌ట‌ప‌డతాం: రావ‌త్‌)

మరిన్ని వార్తలు