ట్రక్‌ డ్రైవర్‌కు భారీ జరిమానా.. తొలి వ్యక్తిగా రికార్డ్‌

8 Sep, 2019 15:35 IST|Sakshi

ఒడిశా ట్రక్‌ డ్రైవర్‌కి 86,500 జరిమానా

భువనేశ్వర్‌: మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశ వ్యాప్తంగా వాహన దారులను బెంబేలెత్తిస్తోంది. ఏ ఒక్కటీ సరిగా లేకున్నా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలతో చుక్కలుచూపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏ వాహనదారుడిని కదిలించినా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకొద్ది జరిమానాలు విధిస్తూ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఓ ట్రక్‌ డ్రైవర్‌కు (అశోక్‌ జాదవ్‌) ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానా విధించారు. వాహన పత్రాలు సక్రమంగా లేవని, వివిధ సందర్భాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించారని అనేక కారణాలతో ఏకంగా రూ. 86, 500 ఫైన్‌ వేశారు. కొత్త మోటరు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అత్యధిక మొత్తం జరిమానా చెల్లించిన వ్యక్తిగా జాదవ్‌ నిలిచారు. ఈ ఘటన ఆదివారం ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు విధించిన జరిమానా చూసి అతను షాక్‌కి గురయ్యాడు. సాధారణ ట్రక్‌ డ్రైవర్‌గా బతుకునీడుస్తున్న తాను ఇంత మొత్తం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్థానిక ట్రాఫిక్‌ అధికారి మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగానే అతనికి జరిమానా విధించామని తెలిపారు. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదని, కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. పోలీసులు చెబుతున్న ట్రాఫిక్‌ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్‌ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు