లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.. హడలెత్తిస్తున్నారు. ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులకు సైతం ఆ హెచ్చిరికల పరంపరను కొనసాగించక తప్పడం లేదు. ముఖ్యమంత్రి ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని, ఫోన్ ఎత్తి మాట్లాడకుండా కారణాలతో తప్పించుకోవాలని చూస్తే వేటును ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. అధికార పగ్గాలు చేపట్టి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకోసం పరిపాలనను గాడిలో పెట్టడంకోసం కృషి చేస్తున్న యోగి.. అధికారులకు ఫోన్లు చేసి మరీ ఆరా తీస్తున్నారు.
దీంతో ఉన్నతాధికారులు ఏకంగా నోటీసు బోర్డుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్య సీఎం ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని, వెంటనే ఎత్తి సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ అందులో పేర్కొంటున్నారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని కూడా అందులో స్పష్టం చేశారు. ఈ ప్రకటనను ముఖ్యమంత్రి యోగి తరుపున శ్రీకాంత్ శర్మ అనే సీనియర్ మంత్రి జారీ చేయగా దానిని అనుసరిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసులు వెలిశాయి. గతంలోనే రోజుకు ప్రతి అధికారి 18 నుంచి 20గంటలు పనిచేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.