రైళ్లకు కొత్త పట్టాలు.!

4 May, 2018 01:38 IST|Sakshi

చరిత్రలో తొలిసారి భారీ కసరత్తు.. 

మొదటిసారిగా పూర్తిస్థాయిలో ట్రాక్‌ పునరుద్ధరణ

300కి.మీ.దక్షిణ మధ్య రైల్వేలో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చనున్న ట్రాక్‌ 

పెరగనున్న రైళ్ల వేగం గంటకు 190కి.మీ.

సాక్షి, హైదరాబాద్‌: చరిత్రలో తొలిసారిగా భారతీయ రైల్వే భారీ కసరత్తు మొదలుపెట్టింది. రైల్వే ట్రాక్‌ను సమూలంగా మార్చే పనిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో మన దేశంలోనూ రైళ్ల వేగాన్ని గరిష్టస్థాయికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా దశలవారీగా 65,000 కి.మీ. (ఇందులో దక్షిణ మధ్య రైల్వే 6,200 కి.మీ.) ట్రాక్‌ను పూర్తిగా మార్చనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.800 కోట్లతో 300 కి.మీ. మేర ట్రాక్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుదిరితే లక్ష్యాన్ని మించి పనులు చేపట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో మొత్తం కొత్త ట్రాక్‌ కనిపించనుంది. కేవలం పట్టాలు మాత్రమే కాకుండా.. వాటి దిగువన ఉండే స్లీపర్లను కూడా కొత్తవి ఏర్పాటు చేస్తారు. గతంలోని ఇనుము, చెక్క స్లీపర్లను తొలగించి కాంక్రీట్‌ స్లీపర్లు బిగిస్తున్నారు. వాటితోపాటు క్లాంప్స్, క్లిప్స్, స్విచ్చెస్‌ వంటివన్నీ కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల లూప్‌లైన్లు, యార్డుల్లోని మెరుగైన పట్టాలను తొలగించి వేరే చోట ఏర్పాటు చేస్తున్నారు.  

20–30 కి.మీ. పెరగనున్న రైళ్ల వేగం 
ఇటీవల రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన హమ్‌సఫర్‌ రైళ్ల గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఇప్పటికిదే భారత రైల్వేలో అత్యధిక వేగం. ఇంతకుముందు ప్రవేశపెట్టిన శతాబ్ది, దురంతో, రాజధానిలాంటి ప్రీమియం కేటగిరీ రైళ్ల గరిష్ట వేగం కూడా 160 కి.మీ. అయినా.. వాస్తవానికి అవి 140 కి.మీ. మించి పరుగుపెట్టడం లేదు. ట్రాక్‌ సరిగా లేకపోవటమే అందుకు కారణం. ప్యాసింజర్‌ రైళ్ల వేగం సామర్థ్యం 120 కి.మీ. కానీ వాస్తవ సగటు వేగం 60 కి.మీ. మాత్రమే. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 130 కి.మీ. ప్రయాణించాల్సి ఉన్నా వేగం 75 కి.మీ. దాటడం లేదు. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 150 కి.మీ. వరకు పరుగుపెట్టే అవకాశం ఉన్నా.. 80 కి.మీ. మించటం లేదు. ఇప్పుడు కొత్త ట్రాక్‌ వేస్తే ఇవి గరిష్ట వేగాన్ని అందుకోనున్నాయి. అదనంగా గంటకు 20–30 కి.మీ. పెంచబోతున్నారు. అంటే తొలిసారిగా మన దేశంలో రైళ్లు గంటకు 190 కి.మీ. వరకు పరుగుపెడతాయన్నమాట! 

తగ్గనున్న ప్రమాదాలు 
పట్టాలు అవసాన దశకు చేరుకోవటంతో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి పట్టా విరిగి రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. కొత్త పట్టాల ఏర్పాటుతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం 250 మీటర్ల పొడవున్న పట్టాలను ఏర్పాటు చేసి వెల్డింగ్‌ ద్వారా వాటిని జోడిస్తున్నారు. ఎండాకాలంలో పట్టాల వ్యాకోచం వల్ల అతుకులు ఊడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో కిలోమీటరున్నర నుంచి రెండు కిలోమీటర్ల పొడవుండే పట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అత్యాధునిక పరిజ్ఞానంతో జోడిస్తున్నారు. దీంతో వ్యాకోచించే సమయంలో ఏర్పడుతున్న సమస్యలు ఇక కనిపించవు.
ప్రస్తుతం ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వేగాన్ని తట్టుకుని ప్రయాణిస్తాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక బోగీపై మరోటి ఎక్కకుండా ఉంటాయి. 

అదనపు రైళ్లకు అవకాశం 
రైళ్ల వేగం పెరగటంతో అవి తొందరగా గమ్యస్థానం చేరుకుంటాయి. ఫలితంగా అదనంగా మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు అవకాశం కలుగుతుంది. తొందరగా గమ్యం చేరుకున్నాక, తదుపరి ప్రయాణం వరకు రైలు ఖాళీగా ఉండే సమయం పెరుగుతుంది కాబట్టి సమీప స్టేషన్‌లకు కొత్త సర్వీస్‌ రూపంలో నడుపుతారు. 

భారీ సరుకు రవాణా వ్యాగన్లు 
ప్రస్తుతం సరుకు రవాణా మందకొడిగా సాగుతోంది. గూడ్సు రైళ్ల గరిష్ట వేగం కేవలం గంటకు 70 కి.మీ. 56 టన్నుల సరుకును మాత్రమే ఒక్కో వ్యాగన్‌లో లోడ్‌ చేస్తున్నారు. ట్రాక్‌ పునరుద్ధరణతో మరిన్ని టన్నుల బరువు మోసే వ్యాగన్లను అందుబాటులోకి తెస్తారు. ఆ రైళ్ల వేగాన్ని కూడా కనీసం 20 కి.మీ. మేర పెంచుతారు. 

పట్టాల వెంట డ్రెయిన్‌ల నిర్మాణం 
వర్షాలు పడ్డప్పుడు వాన నీటితో పట్టాలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టాల మధ్య నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు పట్టాలను మార్చే పనిలో భాగంగా ట్రాక్‌ వెంట వాననీటి కాలువలను కూడా నిర్మిస్తున్నారు. 

నిధులు ఇలా.. 
ప్రతి రైల్వే బడ్జెట్‌లో పాత ప్రాజెక్టులకు కొద్దికొద్దిగా నిధులు కేటాయించే విధానం ఉండేది. గత రెండు బడ్జెట్‌ల నుంచి మోదీ ప్రభుత్వం దాన్ని సమూలంగా మార్చివేసింది. కొన్ని పాతకాలం పెండింగ్‌ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. వీలైనన్ని నిధులు ఒకచోట చేర్చి వాటిని ట్రాక్‌ పునరుద్ధరణకు వినియోగించాలని నిర్ణయించింది. నిధులు వేరే పనులకు మళ్లకుండా ప్రత్యేకంగా ‘రాష్ట్రీయ రైల్‌ సురక్షా కోష్‌’పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.73,065 కోట్లు కేటాయించింది. ఇందులోంచి దక్షిణ మధ్య రైల్వేకు రూ.800 కోట్లను కేటాయించింది.  

మరిన్ని వార్తలు