ట్రెక్కింగ్ @ 81

17 Apr, 2016 02:13 IST|Sakshi
ట్రెక్కింగ్ @ 81

మనదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలు హిమాలయాలే.. ఎముకలు కొరికేసే చలి ఉండే ఆ పర్వత శ్రేణుల్లో ఒకసారి పర్యటించడమే కష్టసాధ్యమైన పని. అలాంటిది ఈ పెద్దాయన హిమగిరి సొగసులూ...ఏమి హాయిలే అనుకుంటూ ఏకంగా పదిసార్లు హిమాలయాలు ఎక్కి దిగేశాడు . ఆయన పేరు గోపాల్ వాసుదేవ్. పుణేకు చెందిన ఈ పర్వతారోహకుడు ఈ మధ్యే లిమ్కా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కి ఔరా అనిపించాడు. ఇందులో గొప్పేముందని అనుకుంటున్నారా? అవును 81 ఏళ్ల వయసులో నడవడమే కష్టమైన విషయం.

అలాంటిది ఏకంగా పర్వతాలు ఎక్కడమంటే మాటలు కాదు. కానీ, గోపాల్‌కు పర్వతారోహణే అత్యంత ఇష్టమైన పని. ఆటోమొబైల్ ఇంజనీర్‌గా 1964లో కెరీర్‌ను ప్రారంభించాక, చాలా ఏళ్లు పుణేలోనే వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఆ సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలిసారిగా 1972లో ట్రెక్కింగ్ చేశాడు. అప్పటి నుంచీ చిన్నాపెద్దా పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నాడు. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు దేహదారుఢ్యం చాలా అవసరమని ఆయన అభిప్రాయం.

అందుకే, ఈ వయసులోనూ రోజుకు 8 కిలోమీటర్ల పాటు నడక సాగిస్తాడు, వారానికోసారి పుణే-ముంబై రహదారి సమీపంలోని చిన్నపాటి కొండను ఎక్కడం, దిగడం చేస్తుంటాడు. గతేడాది సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని 15,350 అడుగుల ఎత్తై రూపిన్ పాస్‌ని అధిరోహించిన సందర్భంగా లిమ్కాబుక్ వాళ్లు పెద్ద వయసు పర్వతారోహకుడిగా ఆయన పేరుని చేర్చారు. 80 ఏళ్లు పైబడినా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఈయన దరిచేరలేదంటే నమ్మాల్సిందే.!

మరిన్ని వార్తలు