పాత నిబంధనలనే అమలు చేయాలి

6 Aug, 2018 00:33 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ చట్ట పరిరక్షణ సమితి డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను యథాతథంగా అమలుచేసేలా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చట్టం తేవాలని చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేతలు ఆదివారం ఢిల్లీలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమితి చైర్మన్‌ మంద కృష్ణమాదిగ, సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, చెన్నయ్య దీక్షలో పాల్గొన్నారు. చట్టాన్ని షెడ్యూల్‌–9లో చేర్చే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా అన్ని దళిత సంఘాలతో కలసి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సింహగర్జన సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రిలే నిరాహార దీక్షలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాఘవులు పాల్గొన్నారు.

దళితుల హక్కులకు భంగం కలిగిస్తారా?
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలించి దళితుల హక్కులకు భంగం కలిగిస్తారా? అని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ప్రశ్నించారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. నిరసనలో టీఎమ్మార్పీఎస్‌ గౌరవాధ్యక్షు డు పరమేశ్వర్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు రాందాస్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు