దయనీయ స్థితిలో.. నాటి కథానాయిక

5 Dec, 2014 23:59 IST|Sakshi
దయనీయ స్థితిలో.. నాటి కథానాయిక

సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్ తదితరులతో సినిమాలు చేసిన నటి నిషా మరణపుటంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె దుఃస్థితి తెలిసి తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. కమలహాసన్ సరసన ‘టిక్ టిక్ టిక్’, రజనీకాంత్‌తో ‘రాఘవేంద్ర’ చిత్రాల్లో నిషా నటించారు. కల్యాణ ఆగాదిగళ్, మయిలుక్కు మూణుకాల్ తదితర చిత్రాల్లో కథానాయకిగా చేశారామె. నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా అనారోగ్యంతో బాధపడుతోందంటూ ఇటీవలే వెబ్‌సైట్లలో ప్రచారం జరగడంతో పాటు, ఈ వార్తను అనేక తమిళ పత్రికలు కూడా ప్రచురించాయి.
 
  ఎముకల గూడులా మారిన దేహంతో నాబూర్ దర్గా సమీపంలో వారం రోజుల పాటు అనాథగా పడి వున్న నిషాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దయనీయ పరిస్థితి చూసి  జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యులైన న్యాయమూర్తి మురుగేశన్ మనసు కకావికల మైంది. వెంటనే ఆయన నిషా సంరక్షణ బాధ్యతలను తీసుకుని ఆమెకు వెంటనే వైద్యం అందించాలని నాగపట్టణం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించి, ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
 
 

మరిన్ని వార్తలు