ఫేస్బుక్ సెల్ఫీతో బుక్కయ్యాడు!

10 Jun, 2016 16:38 IST|Sakshi
ఫేస్బుక్ సెల్ఫీతో బుక్కయ్యాడు!

తిరుచ్చి: భార్యకు హత్య చేసి పారిపోయిన భర్త ఏడేళ్ల తర్వాత అనుహ్యంగా పట్టుబడ్డాడు. ఫేస్బుక్ లో సెల్ఫీ పోస్టు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మణి(45) తన భార్యతో కలిసి తమినాడులోని అరియలూర్ జిల్లా నన్నియూరులో కాపురం పెట్టాడు. మణి తరచుగా తన భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. 2009, ఆగస్టులో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కోపంలో భార్య గొంతు కోశాడు. తర్వాత అక్కడి నుంచి చెన్నెకు పారిపోయాడు.

కందస్వామిగా పేరు మార్చుకుని తొండియార్ పేటలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నాడు. అయితే కేరళలో పనిచేస్తూ తమ కొడుకు మృతి చెందాడని పోలీసులతో మణి తల్లిదండ్రులు నమ్మబలికారు. అయితే ఫేస్బుక్ లో మణి సెల్ఫీ చూసిన అతడి బంధువు షాక్ తిన్నాడు. మరో నలుగురితో కలిసి మణి పనిచేస్తున్న హోటల్ కు వెళ్లాడు. వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారి అనుమానం నిజమైంది.

మణి బతికే ఉన్నాడని నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారని అరియలూర్ డీఎస్పీ పి. ముత్తుకరప్పన్ తెలిపారు. బుధవారం అతడిని అరియలూర్ కు తరలించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అతడు తిరుచ్చి సెంట్రల్ జైలులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు