మరోసారి ల్యాండర్‌ కక్ష్య తగ్గింపు

5 Sep, 2019 05:14 IST|Sakshi

జాబిలమ్మకు మరింత చేరువగా విక్రమ్‌ ల్యాండర్‌..

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగంలో మూడో ఘట్టాన్ని కూడా శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. చంద్రయాన్‌–2 మిషన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిలమ్మకు మరింత దగ్గరగా చేర్చేందుకు బుధవారం తెల్లవారుజాము 3.42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష్య దూరాన్ని తగ్గించారు. దీనికోసం ల్యాండర్‌లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్లపాటు మండించారు. బెంగళూరు సమీపంలోని బైలాలు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్‌ చంద్రుడికి దగ్గరగా 35 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 101 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తోంది.

ఈ నెల ఏడోతేదీ అర్ధరాత్రి 1.30 గంటల నుంచి రెండున్నర గంటల్లోపు ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ల్యాండర్‌ తలుపులు తెరుచుకుని రోవర్‌(ప్రగ్యాన్‌) చంద్రుడి మీదకు దిగి 14 రోజులపాటు తిరిగి వివిధ పరిశోధనలు చేసి సమాచారాన్ని సేకరించి భూ నియంత్రిత కేంద్రానికి పంపిస్తుంది. మరోవైపు.. ల్యాండర్‌ను వదిలిపెట్టిన ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులో వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ల్యాండర్‌ కదలికలను తెలియజేసే పనిలో నిమగ్నమై ఉంది.
 

మరిన్ని వార్తలు