పీఎం–కిసాన్‌ మొదటి విడతలో కోటి మందికి..

15 Feb, 2019 04:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం–కిసాన్‌ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రధాన్‌మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన(పీఎం–కిసాన్‌)ను ప్రభుత్వం ఇటీవల 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 24న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతలుగా అందిం చడం కేంద్రం లక్ష్యం కాగా మొదటి విడతలో కోటి మందికి పైగా లబ్ధిదారులకు రూ.2 వేలు చొప్పున అందనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు పీఎం–కిసాన్‌ పోర్టల్‌లో నమోదైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ కానుంది. రెండో విడతలో రూ.2 వేలను ఏప్రిల్‌ ఒకటో తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 95 శాతం వివరాలు, 9 రాష్ట్రాల్లో 80 శాతం రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగతా రాష్ట్రాలు కాస్తంత వెనుకబడి ఉన్నాయని అధికారు లు తెలిపారు. మొదటి విడత జాబితాలో తమ పేర్లు నమోదైందీ లేనిదీ చెక్‌ చేసుకోవాలని రైతులను కోరారు. 

మరిన్ని వార్తలు