5 రోజుల్లోనే మరో లక్ష

3 Jul, 2020 04:49 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న కరోనా ఉధృతి

18 వేలకు చేరువలో మృతులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ప్రతీ రోజూ 19 వేలు దాటి కేసులు నమోదవుతూ ఉండడంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలను మించిపోయింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 19,148 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయిదు లక్షల మార్కు దాటిన అయిదు రోజుల్లోనే ఆరు లక్షల కేసులు దాటేయడం ఆందోళన కలిగించే అంశం.  మొత్తంగా మరణించిన వారి సంఖ్య 17,834కి చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,59,859గా ఉంది. రికవరీ రేటు 59.52 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే రష్యాతో పోల్చి చూస్తే మన దేశంలో 55 వేల కేసులు మాత్రమే తక్కువ ఉన్నాయి. ఇదే స్థాయిలో కేసులు నమోదైతే అయిదారు రోజుల్లోనే రష్యాను మించి భారత్‌ మూడోస్థానంలోకి చేరుకుంటుందని నిపుణుల అంచనా.

కోవిడ్‌ మృతదేహాల అప్పగింతలో ఆలస్యం వద్దు: కేంద్రం
కోవిడ్‌–19 అనుమానిత లక్షణాలతో చనిపో యిన వ్యక్తుల మృతదేహాలను వారి సంబంధీ కులకు వెంటనే అప్పగించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మృతుల పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడవద్దని తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) రాజీవ్‌ గర్గ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు