చెరువులోకి దూకాలి.. లేదంటే అమ్మ మరణిస్తుంది

6 Sep, 2017 02:20 IST|Sakshi
చెరువులోకి దూకాలి.. లేదంటే అమ్మ మరణిస్తుంది

► ‘బ్లూవేల్‌ గేమ్‌’లో భాగంగా చెరువులో దూకిన యువతి
► రక్షించిన స్థానికులు, పోలీసులు


జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి 17 ఏళ్ల అమ్మాయి చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్‌ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్‌ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ప్రమాదకర ‘బ్లూవేల్‌ గేమ్‌’ ఆడుతూ ఆత్మహత్యకు యత్నించిన యువతి కథ ఇది.

ఏడుస్తూ.. నదిలోకి దూకేసింది..
బీఎస్‌ఎఫ్‌ జవాను కూతురైన ఈ అమ్మాయి మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి సోమవారం రాత్రి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో  ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. ఇదే సమయంలో చెరువు వద్ద యువతి అనుమానాస్పదంగా తిరగడాన్ని స్థానికులు గుర్తించారు.

‘స్కూటర్‌పై ఓ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. చెరువులోకి దూకేందుకు వెళ్తుండటంతో ఆపేందుకు ప్రయత్నించాను. ఏం జరిగిందని అడిగితే.. ‘మా అమ్మ చనిపోతుందని చెప్పింది. ఎందుకు చనిపోతుందని అడిగాను. నేను ఆడుతున్న బ్లూవేల్‌ గేమ్‌ చివరికి వచ్చింది. గేమ్‌ పూర్తి చేయకపోతే మా అమ్మ చనిపోతుంది. అని ఏడుస్తూ చెప్పింది’ అని ఓం ప్రకాశ్‌ అనే స్థానికుడు చెప్పాడు. మాట్లాడుతుండగానే చెరువులోకి దూకిందని, వెంటనే యువతిని కాపాడినట్లు చెప్పాడు. యువతి చెరువులోకి దూకినట్లు తమకు సమాచారం వచ్చిందని, అప్పటికే యువతిని స్థానికులు రక్షించారని పోలీసు అధికారి తెలిపారు. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు