న్యూఢిల్లీ: సినీ ఫక్కీలో దేశ రాజధాని ఢిల్లీలోని దక్షిణపురిలో ఓ హత్య జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన చోటుసుకుంది. సౌత్-ఈస్ట్ డీసీపీ రొమిల్ బానియా కథనం ప్రకారం.. జితు అనే యువకుడు స్థానికం దక్షిణపురి జీ బ్లాక్లో టైర్ రీపేర్లు చేస్తూ జీవనం సాగించేవాడు. రెండు బైకులలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి దాదాపు ఏడున్నర గంటల సమయంలో జితు షాపు వద్దకు వచ్చారు. నలుగురిలో ఇద్దరు బైక్ పై నుంచి దిగిన వెంటనే తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఆ సమయంలో జితూ ఫ్రెండ్ నదీమ్ కూడా అక్కడే ఉన్నాడు. దీంతో వీరిద్దరిని లక్ష్యంగా చేసుకుని సినిమా సీన్లలో గ్యాంగ్లు కాల్పులు జరిపినట్లుగానే వీరిపై పలు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులు క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వీరిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా జితు మృతిచెందాడు. నదీమ్ కాలికి బుల్లెట్ గాయాలు కాగా, అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని డీసీపీ రొమిల్ బానియా వివరించారు. పాత కక్షల నేపథ్యంలోనే దుండగులు ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.