పట్నా: ఉల్లి కోస్తేనే కాదు.. కొనాలన్నా కన్నీళ్లు వస్తున్నాయి. హైదరాబాద్లో కిలో ఉల్లి రూ.80 నుంచి రూ.110 వరకూ పలుకుతోంది. ఇక ఉత్తర భారత్లో అయితే మరీ దారుణం. కిలో ఉల్లి దాదాపు రూ.100 నుంచి 500 వరకూ ఉంది. దీంతో జనాలు వంట చేసుకోవడానికి బిత్తపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించేందుకు బీహార్ ప్రభుత్వం రూ.35కే కిలో ఉల్లి గడ్డను అందిస్తోంది. ఇందుకు గాను బీహార్ స్టేట్ కార్పొరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ఉల్లిగడ్డల కౌంటర్ పెట్టారు. దీంతో జనాలు శనివారం ఉదయమే బారులు తీరారు. చాలా పొడవైన క్యూ ఏర్పడింది. ఉల్లి అయిపోతుందనే భయంతో జనాలు ఎగబడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు హెల్మెట్లు పెట్టుకొని మరీ ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు. రాళ్లతో దాడి చేయడం, వాహనం మీదకు దూసుకువస్తారనే భయంతో హెల్మెట్లు పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు ప్రభుత్వం ఎలాంటి భద్రతను ఏర్పాటు చేయలేదని వాపోయారు.