ఈసీతో విపక్ష నేతల భేటీ

21 May, 2019 16:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ)తో  22 విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమయ్యాయి. కౌంటింగ్‌కు ముందుగా ఈవీఎంల్లో పోలైన ఓట్లతో  వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని కోరాయి. ఒక్కో నియోజకవర్గంలో 5 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిపులను ముందుగా లెక్కించి అవి సరిపోలితే, మిగిలిన అన్ని కేంద్రాల్లో కేవలం ఈవీఎంలను లెక్కించి గెలుపోటములను నిర్ధారించవచ్చని సూచించాయి.

ఈవీఎంలోని ఓట్ల సంఖ్యకు, వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యకు తేడా ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగిలిన అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని విపక్ష నేతలు ఈసీకి సమర్పించిన వినతి పత్రంలో  కోరారు. సంక్లిష్ట సందర్భాల్లో రిటర్నింగ్‌ అధికారి ఎలా వ్యవహరించాలో ఈసీ గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని కోరారు.

ముందుగా వీవీప్యాట్లు లెక్కించిన తర్వాతే ఫలితం ప్రకటించాలని అన్నారు. ఫామ్‌ 17సీని కౌంటింగ్‌ ఏజెంట్లు, లెక్కింపు కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలని, రిటర్నింగ్‌ అధికారి ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ

మరిన్ని వార్తలు