జాబిల్లిపైకి మన ల్యాండర్‌!

5 Jun, 2019 02:25 IST|Sakshi

నాసా ప్రాజెక్టులో భాగం కానున్న టీం ఇండస్‌

మూన్‌ ల్యాండర్‌ను డిజైన్‌ చేస్తున్న భారత కంపెనీ 

అగ్రరాజ్యం అమెరికా జాబిల్లిపైకి ఓ వ్యోమనౌకను పంపుతోందట! ఇందులో మరో విశేషం ఉంది. అదేంటంటే చందమామపై దిగే మూన్‌ల్యాండర్‌ను ఓ భారతీయ కంపెనీ డిజైన్‌ చేస్తోంది. అది కూడా బెంగళూరుకు చెందిన టీమ్‌ ఇండస్‌ అనే సంస్థ. కొన్నేళ్ల కిందట గూగుల్‌ కంపెనీ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ పేరుతో ఓ పోటీ పెట్టింది. రోబోను సొంతంగా తయారుచేసుకుని అంతరిక్షంలోకి పంపితే 3 కోట్ల డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కారణాలేవైనా ఈ పోటీ విజయవంతం కాలేదు.

కాకపోతే ఇందులో పాల్గొన్న టీం ఇండస్‌ మాత్రం జాక్‌పాట్‌ కొట్టేసింది. 2021 నాటికి జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపాలని నాసా నిర్ణయించడం.. సమయం తక్కువగా ఉన్న కారణంగా కొన్ని పనులు ప్రైవేట్‌ కంపెనీలకు ఇస్తామని ప్రకటించడంతో టీం ఇండస్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. దీంతోపాటు ఆస్ట్రోబయోటిక్, ఇంట్యూటివ్‌ మెషీన్స్, ఆర్బిట్‌ బియాండ్‌ అనే మూడు అమెరికన్‌ కంపెనీలు కూడా నాసా ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఇందులో ఆర్బిట్‌ బియాండ్‌ కంపెనీకి సంబంధించిన వ్యోమనౌకను టీం ఇండస్‌ తయారు చేసి ఇవ్వనుంది.

ఈ వ్యోమనౌక జాబిల్లిపై ఉన్న ఓ భారీ లోయలోని మేర్‌ ఇబ్రియం అనే ప్రాంతంలో ల్యాండ్‌ కావాలి. నాసాకు మొత్తం 9 మూన్‌ల్యాండర్ల అవసరం ఉండగా.. వాటిని తయారు చేసేందుకు సరిపడా ఉద్యోగులు అమెరికన్‌ కంపెనీల్లో లేరని.. వేరే కంపెనీలతో వ్యోమనౌకను డిజైన్‌ చేయిస్తోందని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సీఈవో స్టీవ్‌ ఆల్టిమస్‌ చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు