తిరువనంతపురం: కోవిడ్ కోరల్లో చిక్కుకున్న ముంబై నగరానికి సాయమందించేందుకు కేరళ ముందుకొచ్చింది. రాష్ట్రానికి చెందిన 100 మందికి పైగా డాక్టర్లు, 50 మందికి పైగా నర్సులు త్వరలో ముంబై వెళ్లి కరోనా బాధితులకు సేవలందిస్తారని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరింటెండెండ్ డాక్టర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. దీనిలో భాగంగా 16 మంది డాక్టర్లు నేడు బయల్దేరనున్నారని తెలిపారు. ముంబైకి వైద్య సేవల రూపంలో పెద్ద సంఖ్యలో మానవ వనరులు అవసరమని అన్నారు.
(చదవండి: లాక్డౌన్ 5.0 : భారీ సడలింపులు)
కరోనా పోరులో తాము స్వచ్ఛందంగా పాల్గొంటామని ఆయన చెప్పారు. కాగా, ఇద్దరు డాక్టర్లతో సహా డాక్టర్ సంతోష్ కుమార్ ఇప్పటికే ముంబై నగరానికి చేరుకుని సేవలందిస్తున్నారు. వీరంతా అంధేరీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రి సెవెన్ హిల్స్ వైద్యులతో కలిసి పనిచేయనున్నారు. కేరళలో ప్రభుత్వ అనుమతితోనే స్వచ్ఛంద వైద్య సేవలకు తాము సిద్ధమయ్యామని సంతోష్కుమార్ తెలిపారు. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా 67,655 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ముంబైలోనే సగానికి పైగా కేసులు ఉన్నాయి. కేరళలో 1269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
(చదవండి: ముంబైకి తీవ్ర తుపాన్ ప్రభావం)