తబ్లిగీ జమాత్‌ సభ్యులకు కేంద్రం షాక్‌!

4 Jun, 2020 17:56 IST|Sakshi

960 మందిని బ్లాక్‌లిస్టులో పెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 960 మంది తబ్లిగీ జమాత్‌ విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకినట్లు తెలుస్తోంది. పదేళ్లపాటు దేశంలోకి సదరు వ్యక్తుల ప్రయాణాలపై నిషేధం విధించి.. బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు సమాచారం. వీరిలో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రాణాంతక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికులకు మహమ్మారి సోకడం సహా వారంతా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో.. తబ్లిగీల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (వైరల్‌: జమాతే సభ్యులపై డాక్టర్‌ అనుచిత వ్యాఖ్యలు)

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్‌ మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అదే విధంగా దాదాపు 67 దేశాల నుంచి టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించిన విదేశీయులపై కూడా కేసులు నమోదయ్యాయి. అంతేగాక గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మౌలానాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మౌలానాకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను సీజ్‌ చేసి విచారణ వేగవంతం చేశారు.(తబ్లీగ్ జమాత్ చీఫ్‌‌పై సీబీఐ దర్యాప్తు)

మరిన్ని వార్తలు