కాలం తీరిపోయిన లక్ష లీటర్ల బీరు నేలపాలు!

19 Apr, 2019 14:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఎర్రటి ఎండల్లో చల్లని బీరు తాగాలని భావించే మందుబాబుల మనసు ద్రవించే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిన కారణంగా దాదాపు లక్షల లీటర్ల బీరును అధికారులు నేలపాలు చేశారు. దీని విలువు సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. వివరాలు.. నోయిడాలోని ఓ గోడౌన్‌లో మద్యం నిలువచేసి ఉందన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు గురువారం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో 11, 652 బీరు బాటిళ్లను గుర్తించారు. అయితే వాటి ఎక్స్‌పైరీ డేట్‌ ముగిసిపోవడంతో వాటన్నింటినీ పోగుచేసి బుల్డోజర్లతో తొక్కించారు.

ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లకు చెందిన దాదాపు 1.24 లక్షల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో మద్యం నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు సహా దేశంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం రెండో దఫా పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు