-

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

2 Apr, 2020 08:34 IST|Sakshi

అమృత్‌సర్‌: మహ్మమారి కరోనా వైరస్‌ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా (62) కన్నుమూశారు. ఇటీవల లండన్‌ నుంచి తిరిగివచ్చిన ఈయనకు బుధవారం వైద్యులు పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా.. గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్‌ కారణంగానే నిర్మల్‌ సింగ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిర్మల్‌ సింగ్‌ మృతిలో పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కాగా ఆయనతో పాటు పాజిటివ్‌గా తేలిన మరో నలుగురు పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా నిర్మల్‌ సింగ్‌ ఖల్సా పంజాబ్‌లోని అమృత్‌సర్‌ దేవాలయంలో అత్యున్నత పదవిలో కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కాగా మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ రోజురోజూకూ విజృభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1980కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 58మంది మృతి చెందారు.

మరిన్ని వార్తలు