బోర్డర్‌లో పాకిస్తాన్‌ కుయుక్తులు..

19 Jan, 2020 16:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తన భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలను కాపాడేందుకు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ సరిహద్దుల్లో హైటెక్‌ కెమరాలు, సిగ్నల్‌ టవర్స్‌ను ఏర్పాటు చేశాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వాస్తవాధీన రేఖ వెంబడి గ్రామాల్లో పలు ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు సన్నద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమ ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడులు చేస్తే వాటిని కాపాడుకునే క్రమంలో పాక్‌ సైన్యం ఏర్పాట్లు చేస్తోందని సరిహద్దుల్లో కెమెరాలు, సిగ్నల్‌ టవర్స్‌తో పహారా కాస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఎల్‌ఓసీ వెంబడి పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ ఇప్పటికే 18 సిగ్నల్‌ టవర్లను ఏర్పాటు చేశాయి. కెమరాలు, సిగ్నల్‌ టవర్స్‌ను ఏర్పాటు చేసిన అనంతరం ఈనెల 8న పీఓకే బ్రిగేడియర్‌ అసీం ఖాన్‌ నేతృత్వంలో కోట్లీలో జరిగిన భేటీలో వాస్తవాధీన రేఖ వెంబడి జనవరి 26లోగా పలు ఐఈడీ పేలుళ్లకు పాల్పడాలనే నిర్ణయం తీసుకున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు