హఫీజ్‌ సయీద్‌ను దోషిగా నిర్ధారించిన పాక్‌ కోర్టు

7 Aug, 2019 18:24 IST|Sakshi

పాకిస్తాన్‌ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్దౌలా (జేయూడీ)చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను గుజ్రన్‌వాలాలోని యాంటీ టెర్రరిజమ్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేశాడనే కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌(సీటీడీ) వాదనతో ఏకీభవించింది. తదుపరి ఈ కేసు విచారణ పాక్‌లోని గుజరాత్‌ యాంటీ టెర్రరిజం కోర్టులో జరగనుంది. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా పర్యటనకు వెళ్లేముందు హఫీజ్‌ సయీద్‌ను కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్‌.. ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా జులై 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హఫీజ్‌ను హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత  కోట్‌ లక్‌పత్‌ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌పై ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తంచేశారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు