పరువు తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌

14 Sep, 2019 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి అంతర్జాతీయంగా అభాసుపాలయ్యారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దుచేయడంపై రగిలిపోతున్న ఇమ్రాన్, తప్పుడు ట్వీట్‌ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్సీ)లో 47 సభ్యదేశాలు మాత్రమే ఉండగా, ఏకంగా 58 దేశాలు తమకు మద్దతు ఇచ్చాయని ప్రకటించి నవ్వులపాలయ్యారు. ఏం జరిగిందంటే.. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎన్‌హెచ్‌ఆర్సీ సమావేశమైంది. ఇందుకు మొత్తం 47 సభ్యదేశాలూ హాజరయ్యాయి.

ఈ సందర్భంగా కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్‌ ఆరోపించగా, భారత్‌  తిప్పికొట్టింది.  యూఎన్‌హెచ్‌ఆర్సీలో తమ తీర్మానానికి 58 సభ్యదేశాలు మద్దతిచ్చాయని, ఆయా దేశాలకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో ఇమ్రాన్‌ పేర్కొన్నారు. అయితే, యూఎన్‌హెచ్‌ఆర్సీ  మొత్తం 47 దేశాలు మాత్రమే. ఇమ్రాన్‌ ట్వీట్‌పై సామాజికమాధ్యమాల్లో జోకులమీద జోకులు పేలుతున్నాయి. ఇమ్రాన్‌ భూగోళశాస్త్రంతో పాటు గణితం కూడా నేర్చుకుంటే మంచిదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు