రాజస్థాన్‌లో పాక్‌ గూఢచారి అరెస్ట్‌

13 Sep, 2019 13:56 IST|Sakshi

జైపూర్‌ : గూఢచర్యం చేసేందుకు పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది రాజస్తాన్‌లోని బర్మేర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతని పేరు కిషోర్‌ అని, పాకిస్తాన్‌కు చెందిన వాడిగా గుర్తించామని తెలిపారు. బీఎస్‌ఎఫ్‌, భారత ఆర్మీ కార్యకలాపాలపై కీలక సమాచారం తెలుసుకునేందుకు తన మేనమామే తనను భారత్‌కు పంపినట్లు సదరు వ్యక్తి వెల్లడించినట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ అతడు చొరబడినట్లు బీఎస్‌ఎఫ్‌ అనుమానం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లోని ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చానని.. అక్కడి నుంచి తాను సరిహద్దు దాటేందుకు పాక్‌ ఆర్మీ తనకు సాయపడిందని విచారణలో తెలిపాడు. మూడు రోజుల పాటు అతడిని విచారించారు. దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మారుస్తుండడంతో తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలిస్తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.

కాగా సెస్టెంబర్‌ మొదటివారంలో కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకొని విచారించగా లష్కరే-ఇ-తొయిబాకు చెందిన 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐఎస్‌ఐ)తో కలిసి పాక్‌ ఆర్మీ ఎల్‌వోసీ వద్ద దాడులకు తెగబడేందుకు 12కు పైగా లాంచింగ్‌ ప్యాడ్స్‌తో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది.

మరిన్ని వార్తలు