‘గాజులు పంపమంటారా’ అంటూ పాక్‌ రెచ్చగొడుతోంది

7 Sep, 2019 17:35 IST|Sakshi

పాక్‌ ప్రతి కుట్రను తిప్పికొడుతున్నాం

230 మంది ఉగ్రవాదులు చొరబడడానికి సిద్దంగా ఉన్నారు

సరిహద్దుల్లో 20 కిలో మీటర్ల మేర పాక్‌కు చెందిన సిగ్నల్ టవర్లు

వాటి ద్వారా తమ వాళ్లకు రెచ్చగొట్టే సందేశాలు పంపుతున్నారు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోయలో అల్లర్లు సృష్టించడానికి  పాకిస్తాన్‌కు ఉన్న ఏకైక మార్గం ఉగ్రవాదమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. పాక్‌ ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్‌ ప్రజలను కాపాడాడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  భారత వ్యతిరేక ప్రచారంతో కశ్మీరీలో అలజడులను సృష్టించి లోయలో అశాంతిని ఎగదోయడమే పాకిస్థాన్ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించడం అనేది పాకిస్తాన్‌ ప్రవర్తన మీద ఆధారపడి ఉందన్నారు.

‘కశ్మీర్‌లో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దేశంలో చొరబడడానికి 230 మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సిద్ధంగా ఉన్నారు. వీరిలో కొందరు ఇబ్బందులు సృష్టించడానికి సరిహద్దుల్లో చొరబడ్డారని, వ్యాపారులు, స్థానిక ప్రజల కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లో 20 కిలో మీటర్ల మేర పాక్‌కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయి. వాటి ద్వారా కశ్మీర్‌లోని తమ వాళ్లకు సందేశాలు పంపుతున్నాన్నారు. కశ్మీర్‌ నుంచి యాపిల్ ట్రక్కులు సజావుగా ఎలా ప్రయాణిస్తున్నాయని.. వాటిని అడ్డుకోలేరా అంటూ ఇక్కడున్న తమవారికి పాక్ సందేశాలు పంపుతుంది. అడ్డుకుంటారా లేదా గాజులు పంపమంటారా? అంటూ వారిని రెచ్చగొడుతున్నారు’  అని  దోవల్ తెలిపారు.

పాక్‌ ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.  ఏది ఏమైనప్పటికీ ఆంక్షలను క్రమంగా సడలించామని, కశ్మీర్, జమ్మూ, లడఖ్‌లోని మొత్తం 199 పోలీస్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మాత్రమే ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మూడు ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ సేవలను పూర్తిగా పునరుద్ధరించామని తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలోనే అజిత్ దోవల్ ఉంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు