పాక్‌ దుశ్చర్య, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

18 Jul, 2020 10:59 IST|Sakshi

శ్రీనగర్‌: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల ఎల్వోసీ సమీపంలో ఉండే ప్రాంతాలు, జనావాసాలపై పాకిస్తాన్‌ ఆర్మీ శుక్రవారం రాత్రి మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించింది. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఖారీ కర్మారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైనికులు భారీగా మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగించడంతో కర్మారా గ్రామంలోని ఇంటిపై ఒక షెల్ పడింది. ఈ దాడిలో మొహద్ రఫీక్ (58), అతని భార్య రఫియా బీ (50), కుమారుడు ఇర్ఫాన్ (15) అక్కడికక్కడే మరణించారు.
(చదవండి: ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్‌కు..)

అలాగే కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని, మరికొంత మంది గాయపడ్డారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇక తాజా ఘటనపై భారత్‌ ఆర్మీ స్పందించిందని వారు వెల్లడించారు. పాక్‌కు సరైన గుణపాఠం చెప్పాలని భారత సైన్యానికి ఆదేశిలిచ్చినట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు .కాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పర్యటనకు ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. పాకిస్తాన్‌తో ఉన్న ఎల్‌వోసీ వెంట పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన శనివారం అక్కడ పర్యటించనున్నారు. జూన్‌ నెలలో పాక్‌ 411 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు సమాచారం.
(నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌)

మరిన్ని వార్తలు