బరి తెగించిన పాక్‌.. 10 మంది జవాన్ల మృతి

2 Mar, 2019 09:52 IST|Sakshi

సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్న పాక్‌

శ్రీనగర్‌ : ఓ వైపు అభినందన్‌ వర్థమాన్‌ విడుదలతో భారత్‌ పాక్‌ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడుతోంది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్‌ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్‌ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

పూంచ్‌ జిల్లాలో పాక్‌ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్‌ రేంజర్ల దాడిలో రుబానా కోసర్‌ (24), ఆమె కుమారుడు ఫజాన్‌ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్‌ చనిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్‌ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్‌ కాల్పుల్లో నసీమ్‌ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.

గత వారం రోజుల్లో పాక్‌ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల​ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్‌ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.  కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

మరిన్ని వార్తలు