వీణా మాలిక్‌ వివాదాస్పద ట్వీట్‌

5 Jun, 2019 08:25 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన విషయం విస్మరిస్తూ పాక్‌ నటి వీణా మాలిక్‌ గల్లంతైన ఐఏఎఫ్‌ విమానం ఏఎన్‌-32పై వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాడార్‌ కామెంట్‌ను ప్రస్తావిస్తూ ఐఏఎఫ్‌ ఏఎన్‌-32 విమానం వాస్తవంగా కూలిపోలేదని, వాతావరణం మేఘావృతం కావడంతో దాన్ని గుర్తించలేకపోతున్నారని ఆమె ట్వీట్‌ చేశారు.

ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకోవడంతో రాడార్లు గల్లంతైన ఐఏఎఫ్‌ ఏఎన్‌-32 విమానాన్ని కనుగొనలేకపోతున్నారని స్మైలీ ఇమేజ్‌తో ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అసోంలోని జోర్హాట్‌లో సోమవారం సాయంత్రం 13 మంది సిబ్బందితో టేకాఫ్‌ అయిన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఆచూకీ గల్లంతైన సంగతి తెలిసిందే.

అదృశ్యమైన విమానాన్ని గుర్తించేందుకు ఇస్రో శాటిలైట్లు, నావల్‌ పీ-8ఐ గూఢచర్య విమానాలు రంగంలోకి దిగాయి. కాగా భారత్‌లో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌ బాస్‌లో పాల్గొన్న అనంతరం ప్రాచుర్యంలోకి వచ్చిన వీణా మాలిక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ దళాలకు పట్టుబడిన సందర్భంలోనూ ఆమె చేసిన ట్వీట్‌ దుమారం రేపింది.

>
మరిన్ని వార్తలు