పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

4 Apr, 2019 10:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఖేమ్‌ కరన్‌ సెక్టార్‌లో కనిపించిన పాకిస్తాన్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూల్చివేశాయి. పాక్‌ డ్రోన్‌ కదలికలతో సరిహద్దు గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌ సరిహద్దులోని రటోక్‌ గ్రామంలో పాక్‌ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌తో కూల్చివేశారు. కాగా ఈ డ్రోన్‌ పాక్‌ సరిహద్దుల్లో కూలిందా లేక భారత భూభాగంలో పడిపోయిందా అనే వివరాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

కాగా, భారత జవాన్లు డ్రోన్‌పై కాల్పులకు దిగిన ఘటనను తాను చూశానని రటోక్‌ సర్పంచ్‌ లక్బీర్‌ సింగ్‌ చెప్పారు. మరోవైపు పంజాబ్‌ బోర్డర్‌లోకి సోమవారం తెల్లవారుజామున చొచ్చుకువచ్చిన నాలుగు పాకిస్తాన్‌ ఎఫ్‌-16లను వాయుసేన సుఖోయ్‌-30, మిరేజ్‌ 2000 యుద్ధ విమానాలతో తరిమికొట్టాయి. పాక్‌ యుద్ధ విమానాలు నిఘా డ్రోన్‌లతో భారత్‌లోకి చొచ్చుకురావడంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత బలగాల మోహరింపును గుర్తించేందుకే వచ్చాయని భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ ఉగ్ర శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు