పాక్‌ వదిలిన పావురం.. కాలికి రింగ్‌?!

25 May, 2020 16:59 IST|Sakshi

శ్రీనగర్‌: ప్రపంచమంతా కరోనాను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే దాయాది దేశం పాకిస్తాన్‌ మాత్రం పదే పదే వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి తర్ఫీదునిచ్చి దాని కాలికి ఓ ఉంగరం తగిలించి పంపింది. కథువా జిల్లాలోని మన్యారీ గ్రామ ప్రజలు ఈ పావురాన్ని గుర్తించి దానిని స్థానిక పోలీస్‌ స్టేషనులో అప్పగించారు. ఈ విషయం గురించి కథువా ఎస్‌ఎస్‌పీ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ సరిహద్దులో దొరికిన పావురం కాలికి ఓ రింగ్‌ ఉంది. దానిపై కొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ కోడ్‌ను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాం’’ అని పేర్కొన్నారు. (‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’)

కాగా ఓ వైపు దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. పాక్‌ కవ్వింపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక  భారత్‌లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు  ముమ్మరం చేస్తోంది. ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌.. గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు దాయాది దేశ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.(‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’)

మరిన్ని వార్తలు