కొలిక్కిరాని సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపిక

25 Jan, 2019 05:46 IST|Sakshi

మళ్లీ భేటీకానున్న ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ

న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్‌ ఎంపిక కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని గురువారం జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే అసంపూర్ణంగా ముగిసింది. ‘పదవికి అర్హులైన జాబితాలోని అధికారుల పేర్లపై సెలక్షన్‌ కమిటీ సభ్యులు గురువారం చర్చించారు. త్వరలోనే మరోసారి కమిటీ సమావేశమై కొత్త చీఫ్‌ పేరును ప్రకటిస్తుంది’ అని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు సీజే రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జన్‌ ఖర్గే పాల్గొన్నారు. ‘ కేవలం పేర్లపైనే చర్చ జరిగింది. జాబితాలోని అధికారుల కెరీర్, అనుభవం తదితర వివరాలను పొందుపరచలేదు. అందుకే సంబంధిత వివరాలను కోరాం. వచ్చే వారం కమిటీ సమావేశం ఉండొచ్చు’ అని ఖర్గే అన్నారు.

‘సీబీఐ’ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ తప్పుకున్నారు. గత సోమవారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కూడా ఈ కేసును తాను విచారించబోనంటూ తప్పుకోవడం తెలిసిందే. సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే అత్యన్నత స్థాయి కమిటీలో జస్టిస్‌ గొగోయ్‌ సభ్యుడు కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను తొలగించిన అత్యున్నత స్థాయి కమిటీలో జస్టిస్‌ సిక్రీ కూడా ఉన్నారు. ఈ కారణాలనే చూపుతూ వీరిద్దరూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసును జస్టిస్‌ సిక్రీ విచారిస్తే తమకేమీ అభ్యంతరం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ చెప్పినప్పటికీ పక్కకు తప్పుకునేందుకే జస్టిస్‌ సిక్రీ మొగ్గు చూపారు. 

మరిన్ని వార్తలు