‘ఇళ్లలోకి వచ్చి హత్యాచారాలు చేస్తే దిక్కెవరు’

28 Jan, 2020 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణచట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది అక్కడ (షహీన్‌బాగ్‌) గుమికూడారు..వారు ఎప్పుడైనా మీ ఇళ్లలోకి వచ్చి మీ అక్కాచెల్లెళ్లు, కుమార్తెలపై హత్యాచారాలకు తెగబడవచ్చు..రేపపు మిమ్మల్ని మోదీజీ, అమిత్‌ షాలు కూడా కాపాడలేర’ని అన్నారు.

పశ్చిమ ఢిల్లీకి పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న వర్మ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే షహీన్‌బాగ్‌ నుంచి ఆందోళనకారులను గంటలోనే ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ ఐక్యతను చాటుతాయని అన్నారు.కాగా, దక్షిణ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నెలరోజులకు పైగా 200 మంది మహిళలతో పాటు వందలాది మంది సీఏఏను వ్యతిరేకిస్తూ నిరవధిక ధర్నా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షహీన్‌బాగ్‌ ఆందోళన కేంద్రబిందువుగా నేతలు పరస్పర మాటల యుద్ధానికి తెరలేపుతుండటంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

చదవండి : ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా?

మరిన్ని వార్తలు