కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు

1 Jul, 2020 14:02 IST|Sakshi

ఆయుష్ మంత్రిత్వ శాఖతో అభిప్రాయ భేదాలు లేవు : పతంజలి

తమ ఔషధం విక్రయాలకు  అనుమతి ఉంది

సాక్షి,న్యూఢిల్లీ:  కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను ఆయుష్ మంత్రిత్వ శాఖతో పంచుకున్నామని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖకు, పతంజలికి మధ్య అభిప్రాయ భేదాలు లేవంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ మందులు కరోనా నివారణకు పనిచేస్తాయని ఎప్పుడూ పేర్కొనలేదని  పతంజలి  సీఈవో బాలకృష్ణ  ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం.  (పతంజలి కరోనా మందుకు బ్రేక్!

కరోనా కిట్‌లో "దివ్య స్వసరి వతి", "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలను భారతదేశం అంతటా తయారు చేసి పంపిణీ చేయడానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఉందని పతంజలి తాజాగా ప్రకటించింది. తమ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ పత్రాలను ఆయుష్, భారత ప్రభుత్వంతో పంచుకున్నట్లు పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపింది. కోవిడ్-19 నిర్వహణపై తగిన విధంగా పనిచేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టంగా అంగీకరించిందని ప్రకటించింది. ఈ ఔషధాన్ని తీసుకున్న కరోనా రోగులు 3 రోజుల్లో 67 శాతం, 7 రోజుల చికిత్స అనంతరం 100 శాతం కోలుకున్నారని పునరుద్ఘాటించింది. అలా మొత్తం 45 మందికి తమ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని తెలిపింది.  (మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్‌ మందు కాదు!)

కాగా ఆయుర్వేద కంపెనీ పతంజలి కరోనా మహమ్మారికి కరోనిల్ కిట్ పేరుతో ఆయుర్వేద మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్తి వివరాలను  ప్రకటించాలని నిర్వాహకులకు నోటీసులు లిచ్చింది.  దీంతో  పతంజలి ఆయుర్వేద మందుపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు