యూరి ఉగ్రదాడి సూత్రధారికి ప్రాణాంతక వ్యాధి

9 Oct, 2018 15:35 IST|Sakshi
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ (ఫైల్‌ఫోటో)

లాహోర్‌ : భారత్‌లో పలు ఉగ్ర దాడులకు ప్రధాన సూత్రధారి మసూద్‌ అజార్‌ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. తీవ్ర అనారోగ్యంగా జైషే మహ్మద్‌ చీఫ్‌ ఏడాదిన్నరగా మంచానికే పరిమితమైనట్టు హిందుస్థాన్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. యూరి దాడికి బాధ్యుడైన మసూద్‌ అజార్‌ వెన్నుపూస, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కథనం పేర్కొంది.

రావల్పిండిలోని మురీ ప్రాంతంలో కంబైన్డ్‌ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది.కాగా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడాన్ని చైనా సమర్ధించుకుంది. భారత్‌, పాకిస్తాన్‌ సహా ఐరాస భద్రతా మండలి సభ్యుల్లో దీనిపై ఏకాభిప్రాయం లేదని చైనా వాదిస్తోంది.

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఇప్పటికే ఐరాస నిషేధిత ఉగ్ర సంస్ధల జాబితాలో ఉంది. 2016లో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో దాడికి సంబంధించి జైషే చీఫ్‌ మసూద్‌ను ప్రధాన సూత్రధారిగా చార్జిషీట్‌లో పేర్కొంది. గత ఏడాది నాగర్‌కోట దాడిలోనూ మసూద్‌ ఆజాద్‌ కీలకంగా వ్యవహరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు