చనిపోతూ ప్రాణదానం చేసింది..

20 Jun, 2014 22:10 IST|Sakshi

సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన కుమార్తె కిడ్నీలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఠాణేలోని పాటిల్ దంపతులు. ఠాణేలోని బాల్‌కుమ్‌లో పాటిల్ దంపతులు నివసిస్తున్నారు. వీరి కూతురు పదేళ్ల నికితా ఆరవ తరగతి చదువుతోంది.  జూన్ తొమ్మిదవ తేదీన తలిదండ్రులతో సాంగ్లీ నుంచి ఠాణే వస్తుండగా ఖాలపూర్‌లో వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నికితను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
ఆమె తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి నవీముంబైలోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ బి. కె. ఆచార్య ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 12వ తేదీన నికిత మరణించింది. ఈ వార్త ఒక్కసారిగా నికి త తల్లిదండ్రులకు తీవ్ర విషాదానికి గురిచేసింది. అయితే వారు అందరిలా కాకుండా తమ కుమార్తె రెండు కిడ్నీలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నికిత మరో ఇద్దరికి కొత్త జీవితాలను అందించినట్లయింది. ఆమెకు చెందిన రెండు కిడ్నీలలో ఒకటి ఎంజిఎం ఆస్పత్రిలోని పేషెంట్‌కు, మరొకటి ముంబై జెస్‌లోక్ ఆస్పత్రిలోని పేషెంట్‌కు దానం చేసి వారిద్దరికీ ప్రాణం పోశారు. ఇలా పాటిల్ కుటుంబీకులు ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని వార్తలు