'దృశ్యం' లాగా ఆధారాలను మాయం చేశాడు!

5 Feb, 2016 10:53 IST|Sakshi
'దృశ్యం' లాగా ఆధారాలను మాయం చేశాడు!

పాట్నా: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యాడో హంతకుడు. హత్యా నేరాన్ని కప్పిపుచ్చేందుకు సినిమాలో హీరో వేసిన ఎత్తులను బాగా ఒంటబట్టించుకొని పోలీసులను తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కాని చివరికి అందరు నేరస్తుల లాగే చట్టానికి దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. పాట్నాలోని వైశాలి ప్రాంతానికి చెందిన రజనీష్ సింగ్ను వారం క్రితం జరిగిన సృష్టీ జైన్ అనే మహిళ హత్య కేసులో అరెస్టు చేశారు. విచారణలో రజనీష్ వెల్లడించిన నిజాలు పోలీసులను విస్తుగొలిపేలా చేశాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి ఆమెను కాల్చి చంపిన రజనీష్ ఆధారాలను ధ్వంసం చేయడానికి దృశ్యం సినిమాను అనుకరించాడు.

తన మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసి పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని భావించి దానిని ఓ ట్రక్కులోకి విసిరేశాడు. అయితే ఆ మొబైల్ ట్రక్కులో వేయగానే పగిలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే తన మోటార్ సైకిల్ను సైతం గంగా నదిలో పడేశాడు. ఇందుకోసం రూ 500 చెల్లించి ఓ బోట్ను మాట్లాడుకొని వెళ్లి మరీ నదిలో బైక్ను పడేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న రజనీష్ ఓ మ్యాట్రీమోని సైట్ ద్వారా సృష్టి జైన్ను తనకు వివాహం కానట్లు నమ్మించి పాట్నాకు రప్పించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు