ఒకే కుటుంబంపై గ్రామస్తుల మూకుమ్మడి దాడి
బాధితులకు తీవ్రగాయాలు
బరంపురం : చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఓ కుటుంబంపై గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గంలో శుక్రవారం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఐదుగురిపై గ్రామస్తులంతా దాడికి దిగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడం పట్ల పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..
ఐఐసీ అధికారి ప్రశాంత్కుమార్ సాహు
దుర్బాదా, సూలాయి గ్రామం మధ్య ఉన్న ఒక గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది వారిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం క్షతగాత్రులను 108 అంబులెన్స్లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఇదే విషయంపై స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీనికోసం అదనపు పోలీసు బెటాలియన్లను తరలించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు ఐఐసీ అధికారి ప్రశాంత్కుమార్ సాహు తెలిపారు.