రాజధానిలో స్తంభించిన రవాణా..

22 Oct, 2018 09:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆటోలు, ట్యాక్సీలు నిలిచిపోయాయి. ట్రక్‌ డ్రైవర్ల సమ్మెతో పాటు పెట్రోల్‌ డీలర్ల సమ్మెతో రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడంతో సోమవారం సమ్మెకు పిలుపు ఇచ్చామని ఆల్‌ ఇండియా టూర్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన తప్పుడు రవాణా విధానాలతో ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోతున్నారని, యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలు తమ ఉపాధిని దెబ్బతీశాయని సింగ్‌ చెప్పారు.

మరోవైపు రవాణా సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించినందుకు నిరసనగా దేశ రాజధానిలో 400కు పైగా పెట్రోల్‌ పంపులను మూసివేయాలని పెట్రోల్‌ పంపుల యజమానులు నిర్ణయించడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ 2.50 మేర సుంకాన్ని తగ్గించిన క్రమంలో యూపీ, హర్యానాలు సైతం వ్యాట్‌ను తగ్గించి ఊరట కల్పించాయని, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ను తగ్గించేందుకు నిరాకరిస్తోందని ఢిల్లీ పెట్రోల్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు నిశ్చల్‌ సింఘానియా ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు