కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు

16 Aug, 2019 03:56 IST|Sakshi
లదాఖ్‌లో స్థానికులతో కలిసి నృత్యం చేస్తున్న ఎంపీ త్సెరింగ్‌

కశ్మీర్‌ ప్రజల గుర్తింపునకు ఢోకా లేదన్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

శ్రీనగర్‌/లెహ్‌: జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్పష్టం చేశారు. గురువారం షేర్‌–ఇ–కశ్మీర్‌ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర  జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్‌ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి.

నవ కశ్మీర్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్‌లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్‌లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్‌ త్సెరింగ్‌ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

>
మరిన్ని వార్తలు