షాక్‌ : నీటికి కటకట.. నల్లాల్లో మద్యం వరద..!

5 Feb, 2020 17:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం : రోజూలానే ఉదయం నిద్రలేవగానే నీటి కుళాయిలు తిప్పిన కేరళలోని ఓ కాలనీ వాసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నల్లా పైపుల్లోంచి నీటికి బదులు మద్యం రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. త్రిశూర్‌లోని సోలోమన్‌ అవెన్యూలో ఈ విశేషం వెలుగుచూసింది. అక్కడ దాదాపు 18 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన చుట్టపక్కలవారు ఇదేం వింతరా బాబూ.. నీటికి కటకట తెలిసిందే కానీ... నల్లాల్లో మందు సరఫరా అవుతోందని తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. 
(చదవండి : వైరల్‌ : ఎర్రచీరలో ఇరగదీసింది)

ఈ ఘటనపై అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. రచనా బార్‌పై ఆబ్కారీ పోలీసుల దాడి గురించి తెలిసింది. ‘ఆరేళ్ల క్రితం సోలోమన్‌ అవెన్యూకు సమీపంలో ఉండే రచనా బార్‌లో అక్రమంగా వేల లీటర్ల మద్యం నిల్వలు ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. దాదాపు 6 వేల లీటర్ల మద్యం బాటిళ్లను నాశనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. బార్‌లోనే ఓ గొయ్యి తీసి మద్యాన్ని దాంట్లో నింపేశాం. అది భూమిలో ఇంకిపోయింది. కానీ, బార్‌కు సమీపంలోనే ఈ అపార్ట్‌మెంట్‌ నిర్మించడంతో... అక్కడి బోరుబావిలోకి మద్యం చేరింది. నీటితో కలసి కుళాయిల్లోకి ప్రవహించింది’అని ఆబ్కారీ పోలీసులు చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదని పేర్కొన్నారు. అయితే, అబ్కారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అపార్ట్‌మెంట్‌ వాసులు మున్సిపల్‌ అధికారులను కోరారు.
(చదవండి : కరోనా కలకలం : ఈ-వీసాల నిలిపివేత)

మరిన్ని వార్తలు