కారు స్పీకర్‌ ఆర్డర్ చేస్తే.. ఇటుక వచ్చింది!

9 Jan, 2018 11:38 IST|Sakshi

ఆన్‌లైన్‌ ఆర్డర్‌తో బాధితుడి గగ్గోలు

సాక్షి, అన్నానగర్‌: ఆన్‌లైన్‌ ద్వారా కారుస్పీకర్‌ను బుకింగ్‌ చేయగా కొరియర్‌ పార్శిల్‌లో ఇటుక వచ్చింది. ఈ ఘటన తూత్తుక్కుడి సమీపంలోని ముల్‌లైక్కాటులో చోటుచేసుకుంది. న్యాయవాది సెవ్వకుమార్‌ తన కారు స్పీకర్‌ కోసం గత 1వ తేదీన(జనవరి01) ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుంచి వచ్చిన ఆ పార్శిల్‌ని ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థ కార్మికుడు సెల్వకుమార్‌కు అందజేశాడు.

సెల్వకుమార్‌ స్పీకర్‌ ధర రూ. 5వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు. ఆ పార్శిల్‌ తెరిచి చూడగా అందులో ఇటుక ఉంది. కొరియర్‌ సంస్థకు ఫోన్‌ చేయగా వారు సరిగ్గా సమాధానమివ్వలేదు. దీనిపై  ఆయన మల్తైయాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొరియర్‌ సంస్థ యజమానిని విచారణ చేశారు. సదరు కంపెనీ యజామాని సెల్వకుమార్‌కు నగదు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
 

మరిన్ని వార్తలు