దేశ ఆర్థిక పరిస్థితిపై నోరు విప్పిన మోదీ

4 Oct, 2017 20:59 IST|Sakshi

అంతా అద్భుతంగానే ఉంది.. కనిష్ట వృద్ధి కామనే!

నిరాశావాదుల అతిశయోక్తుల్ని పట్టించుకోవద్దన్న ప్రధాని

రెండో త్రైమాసిక ఫలితాల్లో మార్పులు కనిపిస్తాయని ప్రకటన

సంస్కరణలు చేశాం.. ఆలస్యమైనా సత్ఫలితాలొస్తాయని వివరణ

సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలకుతోడు స్వపక్షం నుంచీ వ్యక్తమవుతోన్న తీవ్ర విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. నోట్లరద్దు, జీఎస్టీల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న వాదనలో నిజం లేదని తేల్చిచెప్పారు. స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు కనిష్టస్థాయిలో ఉండటం గత కాంగ్రెస్‌ హయాంలోనూ జరిగిందని గుర్తుచేశారు. రెండో త్రైమాసికంలో వృద్ధిని తప్పక చూస్తారని భరోసా ఇచ్చారు.

సిన్హా, శౌరీలకు పంచ్‌ : దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు నిరాశావాదులు అతిశయోక్తులు మాట్లాడుతున్నారని, అలాంటివారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, కాంగ్రెస్‌ నేత అరుణ్‌ శౌరీల పేర్లు చెప్పకుండా మోదీ పరోక్ష విమర్శలు చేశారు. నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికి సరైన నిర్ణయాలేనని, 21 రంగాలకు సంబంధించి తాము చేసిన 87 సంస్కరణలు సత్ఫలితాలిచ్చేవేనని ఉద్ఘాటించారు.

బుధవారం ఢిల్లీలో జరిగిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మాట్లాడారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతంగాగా నమోదయింది వాస్తవమే. అయితే ఇలాంటి పరిస్థితులు గత యూపీఏ(కాంగ్రెస్‌) హయాంలో చాలా సార్లు జరిగింది. వాళ్ల పాలనలో వృద్ధిరేటు ఏనాడూ 1.5 శాతంను మించలేదు. నాటిలోపాలను సవరిస్తూ ఎన్డీఏ సంస్కరణలు చేసింది. రెండో త్రైమాసికంలో వృద్ధిని చూడబోతున్నాం’ అని ఆయన అన్నారు.

మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు ఏమంటే..
దేశానికి హాని చేసే నిర్ణయాలను నేను ఏనాడూ అనుమతించబోను.
మనం గొప్ప మార్పు దశలో ఉన్నాం. ప్రభుత్వం నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత 3లక్షల డొల్ల కంపెనీలను గుర్తించాం. వాటిలో 2.1 లక్షల కంపెనీల అనుమతులను రద్దు చేశాం.
భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలమైనది. సుస్థిరతను దృష్టిలో ఉంచుకునే సంస్కరణలు చేపడుతున్నాం
నోట్లరద్దు సూపర్‌ సక్సెస్‌ అయింది. జీడీపీలో నగదును 9శాతానికి కుదించగలిగాం. 2016, నంబంర్‌ 8 నాటికి జీడీపీలో నగదు శాతం 12 శాతంగా ఉండేది.
జీఎస్టీ కౌన్సిల్‌కు నేను గట్టిగా సూచించా.. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆయా వర్గాల నుంచి అందుతోన్న సూచనల మేరకు అవసరమైనమేర చట్టంలో మార్పులు చేయాలని ఆదేశించా.

మరిన్ని వార్తలు