గ్లాసు పాల కన్నా పెగ్గు బీరు మిన్న!

22 Dec, 2019 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘పాలు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు’.. ప్రభుత్వ నినాదమిది. రోజూ లేవగానే ఒక గ్లాసుడు పాలు తాగాలని పిల్లలకు పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ(పెటా) మాత్రం.. మనుషుల ఆరోగ్యానికి పాల కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్‌ అని చెబుతోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆరోగ్యం కోసం పాలకంటే బీరే చాలా మంచిదని పెటా ఘంటాపథంగా చెబుతోంది. ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని పెటా ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రేసీ రీమాన్స్‌ స్పష్టం చేశారు. డెయిరీ ప్రాడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తాయని పెటా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధుల, ఒబెసిటీ, డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని పెటా హెచ్చరించింది. ఇక డెయిరీ ఉత్పత్తుల వాడకం వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని చెప్పిన పెటా.. దీన్ని నిర్థారిస్తూ కొన్ని రుజువులను కూడా వెల్లడించింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయని చెబుతోంది. 

మరిన్ని వార్తలు