లాక్‌డౌన్‌ : ఉచిత ఇంటర్‌నెట్‌, అపరిమిత కాల్స్‌

17 Apr, 2020 14:43 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలకు ఉచిత ఇంటర్‌నెట్‌ సదుపాయం, అపరిమిత కాల్స్‌, ఉచిత డీటీహెచ్‌ సేవలు అందించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ వ్యాజ్యం దాఖలైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి బడా వ్యాపారస్తుల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని మానసిన ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఉచిత ఇంటర్‌నెట్‌, టీవీ, అపరిమిత కాల్స్‌  కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు వీటిని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి, ట్రాయ్ (టెలికామ్‌ రెగ్యూలేటరి అథారిటి ఆఫ్‌ ఇండియా)ను న్యాయస్థానం ఆదేశించాలని న్యాయవాది మనోహర్‌ ప్రతాప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని, దీంతో చాలా మంది మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇంటర్‌నెట్‌ వంటి సదుపాయాలుని ఉచితంగా కల్పించడం వల్ల బంధువులు, స్నేహితులతో ఎక్కువ సేపు మాట్లాడుకుంటారని తద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం  ఉందని కోర్టుకు విన్నవించారు.
 

మరిన్ని వార్తలు