బైక్‌లపై వచ్చి ఠాణాపై బాంబులు విసిరి..

13 Jul, 2017 20:04 IST|Sakshi
బైక్‌లపై వచ్చి ఠాణాపై బాంబులు విసిరి..
చెన్నై: చెన్నై కలకలం రేగింది. తేనాంపేట పోలీసు స్టేషన్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శక్తిమంతమైన పెట్రోలు బాంబును విసిరేశారు. దీంతో ఆ ప్రాంతంతో తీవ్ర సంచలనం కలిగించింది. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బందాలను ఏర్పాటుచేశారు. చెన్నై నగర అతి ముఖ్యమైన పోలీసు స్టేషన్లలో ఇది కూడా ఒకటి. 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్‌ గార్డెన్‌ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్‌ పరిధిలోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మౌంట్‌రోడ్‌ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నందనం సిగ్నల్‌ నుంచి మౌంట్‌రోడ్‌ వైపుగా రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్‌ రాగానే తమ చేతిలో ఉన్న రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్‌ వైపు విసిరారు. దీంతో పెద్ద శబ్దంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారు.

ఈ పేలుడు శబ్దానికి మౌంట్‌రోడ్‌లో పోస్టర్లు అతికిస్తున్న ఓ వ్యక్తితోపాటు స్టేషన్‌లోపల ఉన్న ముగ్గురు పోలీసులు బయటికి వచ్చి చూశారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పెట్రోలు బాంబులు విసిరినట్లు ఆ పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. అక్కడి మంటలను పోలీసులు నీళ్లు చల్లి ఆర్పివేశారు. ప్రవేశ ద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్‌ సమీపాన అమెరికన్‌ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దృష్టితో ఇలా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వార్తలు