రికార్డు స్థాయికి పెట్రో మంట

9 Sep, 2018 03:07 IST|Sakshi

ఎన్నికల నేపథ్యంలో త్వరలో ధరలు తగ్గించే యోచన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్‌ ధర రూ. 80 మార్కును దాటింది. డాలర్‌తో రూపాయి మారకవిలువ తగ్గడంతో దిగుమతుల ధరలు పెరిగినందువల్లే ఈ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే పెట్రోల్‌ ధర 39 పైసలు, డీజిల్‌ ధర 44 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.80.38కి, డీజిల్‌ రూ.72.51కి చేరింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.87.77 కాగా, డీజిల్‌ రూ. 76.98కు పెరిగింది.

మిగిలిన మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా, ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. కాగా, పెరుగుతున్న పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ సోమవారం (సెప్టెంబర్‌ 10న) విపక్షాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నుల కారణంగానే పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌ ధరలను తగ్గించే విషయంపై కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మరో రెండు నెలల్లో 4 రాష్ట్రాలకు ఎన్నికల నేపథ్యంలో ప్రజావ్యతిరేకత రాకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు