లీటరు పెట్రోల్‌పై రూపాయి తగ్గింపు

11 Sep, 2018 17:55 IST|Sakshi

కోల్‌కతా : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడికి గుద్దిబండలా మారాయి. రోజురోజుకు పైకి ఎగియడమే తప్ప, అసలు తగ్గడం లేదు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై విపక్షాలు నిన్న భారత్‌ బంద్‌ కూడా చేపట్టాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న ఆందోళనలు పెల్లుబిక్కుతున్న ఈ సమయంలో రాష్ట్రాలు రేట్ల తగ్గింపుపై దృష్టిసారిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరపై వాహనదారులకు ఊరటనిచ్చింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క రూపాయి ధర తగ్గించింది. ‘తాము పన్నులను పెంచడం లేదు. మేము నిరంతరం సామాన్య ప్రజల గురించే ఆలోచిస్తుంటాం. పెట్రోల్‌, డీజిల్‌ పరిమితిని మించి ఎగియడంతో, లీటరు ఇంధన ధరపై ఒక్క రూపాయి తగ్గించాలని నిర్ణయించాం’ అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వెంటనే సెంట్రల్‌ సెస్‌ను కేంద్రం ఉపసంహరించాలని కూడా మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. 

ఓ వైపు క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నప్పటికీ, ధరలను పెంచుతున్నారని, సెస్‌ను పెంచుతున్నారని, ఈ రెండింటిన్నీ పెంచకూడదని అన్నారు. కాగా, మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. మహారాష్ట్రాలో అయితే ఏకంగా పెట్రోల్‌ ధర సరికొత్త రికార్డులో రూ.90 క్రాస్‌ చేసింది. న్యూఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్‌ ధర రూ.80.87గా, కోల్‌కతాలో రూ.83.75గా, ముంబైలో రూ.88.26గా, చెన్నైలో రూ.84.07గా ఉన్నాయి. డీజిల్‌ ధర లీటరుకు ఢిల్లీలో రూ.72.97గా, కోల్‌కతాలో రూ.75.82గా, ముంబైలో రూ.77.47గా, చెన్నైలో రూ.77.15గా రికార్డయ్యాయి. ఆదివారం రాజస్తాన్‌ ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నును తగ్గించింది. ఈ ధరలపై 4 శాతం పన్ను రేట్లను తగ్గించినట్టు ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించారు. దీంతో ఆ రాష్టంలో లీటరు ఇంధన ధరలు రూ.2.5 తగ్గాయి.   

మరిన్ని వార్తలు