ఆల్‌టైమ్‌ గరిష్టానికి పెట్రోల్‌

2 Oct, 2018 04:05 IST|Sakshi

న్యూఢిల్లీ: సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్‌ ధరలు సోమవారం ఆల్‌ టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91 మార్క్‌ను దాటింది. ముంబైలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఔట్‌లెట్లలో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.08 ఉండగా, డీజిల్‌ రూ.79.72కు చేరుకుంది. ఇక, భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (బీపీఎల్‌) ఔట్‌లెట్లలో పెట్రోల్‌ రూ.91.15 కాగా, డీజిల్‌ రూ.79.79గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటంతో ఆయిల్‌ కంపెనీలు సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83.73, డీజిల్‌ రూ.75.09కు చేరుకొని రికార్డు సృష్టించాయి. గడచిన 6 వారాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.6.59, డీజిల్‌ 6.37 రూపాయలు పెరగటం గమనార్హం.

మరిన్ని వార్తలు